MLC Elections | హైదరాబాద్ : ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.26 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 4 లోపు ఎవరైతే క్యూలైన్లలో ఉంటారో వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ ఎన్నిక ఫలితం జూన్ 5వ తేదీన వెలువడనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ నియోజకవర్గానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.
బరిలో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీపడుతున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,63,839 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.