హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో బుధవారం బడ్జెట్పై జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ.. పనిచేయగలగడానికి ప్రతి పౌరుడికి తగిన వాతావరణం కల్పించే సంగతి తెలంగాణ ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. ఆ దిశగా ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. రైతులకు ప్రభుత్వం పెట్టుబడితోపాటు ఉచిత విద్యుత్తు అందిస్తున్నదని అన్నారు.
కుల వృత్తులపై ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ఉద్యోగ కల్పనకు, ఆయా వర్గాల బలోపేతానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించడానికి దారితీస్తున్నదన్నారు. 5.37 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒకకొక్కరికి రూ.10 వేలు, 2.12 లక్షల మందికి రూ.20 వేల చొప్పున అందించిందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2.42 లక్షలకుపైగా ఉద్యోగాలను ప్రభుత్వం నోటిఫై చేసిందని,ఆయా పరీక్షల సన్నద్ధతకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పరీక్షలు రాయలేకపోయిన వారిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాల్లో వయోపరిమితిని కూడా సడలించినట్టు చెప్పారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించుకొని 95 శాతం ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలే ఇచ్చుకునే విధంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న దాదాపు పది లక్షల ఉద్యోగాల భర్తీకి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి అంశాలపై మాట్లాడటానికి కాంగ్రెస్ సభ్యుడు జీవన్రెడ్డికి ఎందుకు నోరు రావడం లేదని ప్రశ్నించారు. కొత్త పథకాలు ప్రవేశ పెడుతూ పాత పథకాలను కొనసాగించాలని జీవన్రెడ్డి సూచించారని, అయితే గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తే స్కాములే తప్ప సీములు ఉండవు అని విమర్శించారు. పాత పథకాలను కొనసాగించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు.