లక్ష్మీనరసింహుడి సేవలో ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు
సొంత నిధులతో సీహెచ్ కొండూర్ గ్రామంలో నిర్మాణం
రేపటి నుంచి ఆలయ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ప్రారంభం
నిజామాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతుల సంకల్ప బలం, కవిత అత్తమామలు దేవనపల్లి రామ్కిషన్రావు, నవలత సారథ్యంలో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకొన్నది. తమ సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా చౌడమ్మ కొండూర్ (సీహెచ్ కొండూర్)లో నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్ఠాపన ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికర చరిత్ర ఉన్నది. సీహెచ్ కొండూర్ ఒకప్పుడు గోదావరి నదికి ఆనుకొని ఉన్న కుగ్రామం. దశాబ్దాల క్రితమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ కారణంగా ముంపు బారిన పడింది. దీంతో వందల కుటుంబాలు అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం తరలివెళ్లి, సీహెచ్ కొండూర్ పేరుతోనే స్థిరపడ్డాయి. నాడు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలంతా కొంగుబంగారంగా కొలిచే శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సైతం ముంపుబారిన పడింది. దీంతో లక్ష్మీనరసింహుడి విగ్రహాలను సైతం తమ వెంటే నూతన గ్రామానికి తీసుకొచ్చారు. చిన్నపాటి గూడు ఏర్పాటుచేసి, ఐదున్నర దశాబ్దాలుగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
పోతంగల్కు చెందిన రామ్కిషన్రావు పూర్వీకులు సైతం సీహెచ్ కొండూర్లోని లక్ష్మీనరసింహస్వామినే తమ ఇలవేల్పుగా ఆరాధించేవారు. సీహెచ్ కొండూర్కు వచ్చి మొక్కులు చెల్లించుకొనేవారు. నిరుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతులు ఇక్కడ పూజలు నిర్వహించిన సందర్భంలో తమ ఇలవేల్పుకు గుడి కట్టించాలని నిశ్చయించుకొన్నారు. 2021 ఆగస్టు 15న దేవనపల్లి రామ్కిషన్రావు దేవాలయానికి భూమిపూజ చేయగా, ఏడాదిలోపే నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
ఆరు రోజుల పాటు ధార్మిక క్రతువులు
నూతన ఆలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్సీ కవిత, అనిల్కుమార్ దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి మార్గదర్శకంలో శిలామయ, లోహమయమూర్తి, ధ్వజస్తంభ, యంత్ర ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం వంటి మహాధార్మిక క్రతువులను నిర్వహిస్తున్నారు. జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు లోక కల్యాణార్థం, విశ్వశాంతి, ప్రజల ఆయురారోగ్య, ఐశ్వర్య సిద్ధి కోసం ఆరు రోజుల పాటు విశిష్ట పూజలను నిర్వహించనున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రుత్వికులను రప్పిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయం ప్రాచీన కట్టడాలను పోలినట్టు ఉండటం విశేషం.
ఆలయ నిర్మాణం పూర్వ జన్మ సుకృతం
మా ఇంటి ఇలవేల్పు శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించుకొనే భాగ్యం కలగడం మా కుటుంబీకుల పూర్వజన్మ సుకృతం. తరతరాల నుంచి మా వంశీయులమంతా సీహెచ్ కొండూర్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని కొలుస్తున్నాం. చాలా మహిమ కలిగిన దేవుడ్ని పూజించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చాలామంది నిత్యం వస్తుంటారు. మా ఇంట ఏ శుభకార్యం జరిగినా స్వామివారినే మొదటగా పూజించడం మా ఆనవాయితీ.
– దేవనపల్లి రామ్కిషన్రావు, ఎమ్మెల్సీ కవిత మామ