MLC Kavitha | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్ ఈ నెల 26వ తేదీన జలవిహార్ బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం వైఎస్ఆర్సీపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సహా పలు బీసీ సంఘాల ప్రతినిధులు, పలు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు కవితతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీసీల అభ్యున్నతి, సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను కవిత వివరించారు. బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. బీసీలు ఆర్థికంగా బలపడాలన్న ఆలోచనతో బీసీబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కుల వృత్తులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. మార్కెట్ కమిటీల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ నిర్మాణంలో ఈ వర్గాలకు సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పించి చరిత్ర సృష్టించారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరు
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని, బీసీ కులగణన చేపట్టాలని 2004లోనే కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆర్ కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్ నాటి ప్రధాని మన్మోహన్ దగ్గరికి తీసుకెళ్లిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీ అభ్యున్నతి కోసం ఆర్థిక, విద్యారంగాల్లో సీఎం కేసీఆర్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. బీసీల పట్ల తమ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని, బీసీలకు రావాల్సిన వాటా, హకుల కోసం జరుగుతున్న ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. బీసీల కోసం జీవితాంతం పోరాటం చేస్తున్న కృష్ణయ్యను ఆమె అభినందించారు.
తెలంగాణ నుంచే రిజర్వేషన్ల శంఖారావం
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ శంఖారావం పూరించనున్నది. ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. మూడురోజుల క్రితం ప్రభుత్వంలోని 19 రాష్ట్ర కార్పొరేషన్లకు చెందిన బీసీ సామాజిక వర్గాల చైర్మన్లు హరితప్లాజాలో సమావేశమయ్యారు. బలమైన రాజకీయ పార్టీ వెన్నుదన్నుగా ఉంటే ఆ ప్రభావం దేశంలోని ఇతర రాజకీయ పార్టీలపై పడి బీసీల డిమాండ్ల సాధన తేలికవుతుందని ఆ వర్గాల నాయకులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం బీసీ ఉద్యమానికి ఊపునిచ్చే సంఘటన చోటుచేకున్నది. హైదరాబాద్ ఎమ్మెల్సీ కవిత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేతకాని, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ పల్లె రవి, ఆంజనేయగౌడ్, మఠం భిక్షపతి, దూదిమెట్ల బాలరాజు, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ ఉపేందర్, శుభప్రద్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జీహెచ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, బీసీ నేతలు ఆస్కాని మారుతీసాగర్, రాజారాం యాదవ్, తాడి శ్రీనివాస్ తదితరులు భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలపై చర్చించారు. ఈ నెల 26న జలవిహార్ నిర్వహించే సమావేశం అనంతరం ఢిల్లీలో లేదా మరో ప్రాంతంలో బీసీ డిమాండ్ల సాధన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆర్ కృష్ణయ్య చెప్పారు.