నల్లగొండ : రాష్ట్రంలో బీజేపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన కొవిడ్ నిబంధనలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉల్లంఘించి దీక్షకు దిగడం సరికాదన్నారు. బీజేపీ నాయకులను చూసి దేశ ప్రజలందరూ భయపడుతున్నారని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని సంస్థలను అమ్ముకుంటూ పోతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు మతాలను, కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులతో ప్రతిపక్షాలను అణచివేయాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణలో కూడా కుయుక్తులు పన్నుతున్నారు. బీజేపీ నిరంకుశ పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాగేసుకోవడం ప్రజాస్వామ్య నికి మంచిది కాదు. బీజేపీకి అధికార యావ తప్ప మరొకటి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317 పట్ల బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.