హైదరాబాద్ : సాటి వారిపట్ల ప్రేమతో వ్యవహరించాలి.. సన్మార్గంలో పయనించాలి అనే యేసుక్రీస్తు సూక్తులను ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. క్రిస్మస్ సందర్భంగా సోమవారం సికింద్రాబాద్లోని వెస్లీ చర్చి(Wesley Church)లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం బిషప్ పద్మారావు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేశారు. చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు పుట్టిన రోజును గొప్ప వేడుకగా జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించారని, నాటి నుంచి నేటి వరకు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారని తెలిపారు. అలాగే సనత్నగర్లోని మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాదర్లు జేమ్స్, చర్చి కమిటీ సభ్యులు చందన్, సుధీర్, దివాకర్, దేవ సహాయం, కమలాకర్, ఫ్రాన్సిస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.