హైదరాబాద్ : విచ్ఛిన్నమే బీజేపీ విధానమని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేతకే ఆ పార్టీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుందా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం అడ్డదారులు తొక్కమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణాచల్ప్రదేశ్, గోవా, కర్నాటక, మహారాష్ట్ర సహ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ఎర కేసుతో బీజేపీకి ఉచ్చుబిగుస్తోందన్న ఆయన.. దొంగ స్వాముల బండారం బయటపడిందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం ఎలా?.. ప్రభుత్వాలను కూల్చడం ఎలా ? అనే అంశంపైనే బీజేపీ శిక్షణా శిబిరాల్లో పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు. కిషన్రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందన్నారు. బీజేపీ నాయకులవి చెప్పేవి పవిత్రపు మాటలని.. చేసేవి దుర్మార్గ చర్యలని ధ్వజమెత్తారు. అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేక.. నీచ సంస్కృతిక బీజేపీ తీరలేపిందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో టీఆర్ఎస్కు, బీజేపీకి స్పష్టమైన తేడా ఉందన్నారు.
ప్రభుత్వాల కూల్చివేతల కోసం కుట్రలు, కుతంత్రాల కోసం బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తమ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్ఎస్లో చేరామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారం కోసం ఎమ్మెల్యేలను చేర్చుకోలేదనే అసలు విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. తమ చేరికలతోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 10వ షెడ్యూల్ ప్రకారం తాము చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశామన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పదవికి రాజీనామా అనంతరమే చేర్చుకున్నామని చెప్పే బీజేపీ నేతలు.. ప్రభుత్వాలను కూల్చిన ఎనిమిది రాష్ట్రాల్లో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. హిందూమతానికి తామే పేటెంట్ అయినట్టు బీజేపీ వ్యవహరిస్తుందని, పెద్దపెద్ద బొట్లతో.. నోట్లో పాన్పరాగ్ వేసుకొని జై శ్రీరాం అంటేనే దైవభక్తా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కాలానుగుణంగా అదృశ్యమయ్యే పార్టీని అని ఎద్దేవా చేశారు. మారిన విషయంలో ఆ పార్టీ నేత మాణిక్కం ఠాకూర్ ఇచ్చిన సమన్లపై న్యాయపరంగా స్పందిస్తామన్నారు.