హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): వట్టినాగులపల్లిలో తాను భూదాన్ భూమిని కొన్నట్టు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ‘నేను కొన్నది భూదాన్ భూమి కాదు. నాకు అక్కడ ఎకరం 10 గుంటలు మాత్రమే ఉన్నది. 2012లో ఒప్పందం కుదిరింది. 2014లో రిజిస్ట్రేషన్ అయింది. వివరాలను 2015, 2021, 2023 ఎన్నికల అఫిడవిట్ల్లో కూడా వెల్లడించాను. కానీ ప్రతిసారీ ఆంధ్రజ్యోతి బీఆర్ఎస్ నేతలపై, నాపై అభూత కల్పనలు, అవాస్తవాలు, ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురిస్తున్నది.
నేను 2012లో వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 188/1/2లోని భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, లీగల్ ఒపీనియన్ తీసుకొని, రికార్డును క్షుణంగా పరిశీలించిన తరువాత మాత్రమే దానిని కొనుగోలు చేశాను’ అని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. తాను కొన్నది భూదాన్ భూమి కాదని, ఎవరికైనా వివరాలు కావాలంటే ప్రభుత్వపరంగా వెరిఫికేషన్ చేసుకోవచ్చునని లేదా తను సంప్రదించినా తెలియజేస్తానని పేర్కొన్నారు.
వట్టినాగులపల్లిలో తనకు ఎకరం 10 గుంటలు మాత్రమే ఉన్నదని, అది ఆంధ్రజ్యోతి పేర్కొన్న 29 ఎకరాల భూముల్లో భాగం కాదని తెలిపారు. లేని భూమిని తన పేరు మీద ఉన్నట్టు, అది భూదాన్ భూమి అయినట్టు పదే పదే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ దుష్ప్రచారం చేయడం వారి దుర్బుద్ధిని, బ్లాక్మెయిల్ తత్వాన్ని తెలియజేస్తున్నదని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.