మేడ్చల్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తనపై అక్రమ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుపై కోర్టును ఆశ్రయించనున్నట్టు మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గిరిజన భూములతో తనకు ఎలాంటి సంబంధం లేకుండా అట్రాసిటీ కేసును ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. గిరిజనుల భూమిని ఆక్రమించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. వీటిని ప్రజలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి కేశవరంలోని 47 ఎకరాల 18 గుంటల భూమిలో తన పేరిట పాస్బుక్ లేదా పహాణీలోనైనా తన పేరు ఎక్కడా లేదని, అవసరమైతే ఆన్లైన్లో తనిఖీ చేసుకోవాలని స్పష్టం చేశారు. గిరిజనుల భూమి ఆక్రమణలపై ఎలాంటి ఆధారం లేకుండా కేసు నమోదు ఎందుకు చేశారో అర్థం కాలేదని చెప్పారు. గిరిజనుల భూమిని ఆక్రమించినట్టు ప్రచారం చేస్తున్నవారు ఆధారాలు చూపించాలని మల్లారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా, అకారణంగా, స్వార్థంతో, లాభాపేక్ష కోసం తనపై తప్పుడు కేసు నమోదు చేసిన వారిపై కోర్టే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని మల్లారెడ్డి చెప్పారు.