జోగులాంబ గద్వాల : రాజకీయాల్లో నడిగడ్డకు ప్రత్యేక చరిత్ర ఉందని, కాంగ్రెస్ వారు చూపే ప్రలోభాలకు స్థానిక సంస్థల ప్రతినిధులు గురై భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి (Naveen Kumar Reddy) మద్దతుగా స్థానిక సంస్థల ప్రతినిధులతో సన్నాక సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారన్నారు. అదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేద్దామని కోరారు. ఉమ్మడి జిల్లాలో 1439 మంది స్థానిక సంస్థల అభ్యర్థులు ఉన్నారని అందులో బీఆర్ఎస్ కి చెందిన వారే సుమారు 900 మందికి పైగా ఉన్నారని చెప్పారు.
అందరూ కలిసికట్టుగా ఓటు వేసి నవీన్ కుమార్ రెడ్డిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని, మరోసారి వారు చెప్పే మాయమాటలు నమ్మి ఓటు వేస్తే మనకు గోస తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రాంరెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్ చైర్మన్ కేశవ్ పాల్గొన్నారు.