హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ అరవింద్ కేడీ నంబర్వన్ అని, కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి బేడీ నంబర్వన్ అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఫైర్ అయ్యారు. అరవింద్ స్టంట్ మాస్టర్ అని, రేవంత్ ఒక టెంట్ మాస్టర్ అని అభివర్ణించారు. బట్టేబాజ్, బేకార్, బడాచోర్ అంటూ అరవింద్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణభవన్లో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు దమ్ముంటే ఆర్మూర్లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అరవింద్ ఒక సైకో అని, డ్రగ్ అడిక్ట్ అని ఆరోపించారు. ఆయన ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని, దేశంలో ఒకే ఇంట్లో మూడు పార్టీలు ఉన్న ఏకైక కుటుంబం అరవింద్దని ఎద్దేవాచేశారు.
అరవింద్ తాగిన మత్తులో మాట్లాడుతున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి పరిధిలో పనిచేస్తుందో తెలుసుకోవాలని హితవుపలికారు. నవంబర్ 4 నుంచి మళ్లీ దళితబంధు హుజూరాబాద్లో ప్రారంభమవుతుందని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ కవితపై మరోసారి మాట్లాడితే మహిళలు చీపుర్లు, చెప్పులతో కొడతారని హెచ్చరించారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతో అరవింద్ గెలిచారని, దుబ్బాకలోనూ అదే రీతిలో ఆ పార్టీలు కుమ్మక్కు కావడంతోనే బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లోనూ ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని, అయినా ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని వివరించారు. అక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తుచేశారు.
హుజూరాబాద్లో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. ఫాల్తూ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు రేవంత్రెడ్డి అని, ఆయనతో తాము ఓటుకు నోటులో, ఆర్టీఐ దరఖాస్తుల్లో, బ్లాక్ మెయిల్లో పోటీపడలేమని ఎద్దేవాచేశారు. ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని, ఆయనతో సమానంగా అన్ని భాషల్లో మాట్లాడగలరా అని రేవంత్కు సవాల్ విసిరారు. సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పాల్గొన్నారు.