జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖాన వద్ద రూ రూ. 46 లక్షల వ్యయంతో సింగరేణి సంస్థ నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ప్రారంభించడం శుభపరిణామమన్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మిక సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందులో భాగంగా భూపాల్ పల్లి ఏరియాలో కార్మికుల సౌకర్యార్థం 994 డబుల్ బెడ్ రూమ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టామన్నారు. భూపాలపల్లిలో మార్కెట్ నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయించారన్నారు. అదేవిధంగా మరో రెండు కోట్లు సీఎస్ఆర్ నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ విధానం అమలు చేసే విధానాన్ని పరిశీలించాలని సూచించారు. అనంతరం సింగరేణి డైరెక్టర్లు బలరాం చంద్రశేఖర్, సత్యనారాయణ మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సింగరేణి సీఎండీ శ్రీధర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.