చాంద్రాయణగుట్ట, జూలై 5 : ఒక్క విద్యాసంస్థను కూల్చేస్తే వంద విద్యాసంస్థలు నిర్మిస్తామని చాంద్రాయణగుట్ట మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ గౌస్నగర్లోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫాతిమా కళాశాల అంశంపై మమ్ములను భయపెట్టాలని చూస్తున్నారు. మేం అవినీతికి పాల్పడలేదు. మీ బెదిరింపులకు తలొగ్గేది లేదు.
మా విద్యాసంస్థలను కూల్చివేస్తామంటున్నరు. ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఒక్కటి కూల్చేస్తే వంద విద్యాసంస్థలు నిర్మిస్తాం. విద్యాసంస్థలున్నా, లేకపోయినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూస్తా’మని పేర్కొన్నారు. సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో రూ.కోటీ 19లక్షలను 366మంది పేద విద్యార్థుల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అనంతరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, వొకేషనల్ కోర్సుల సర్టిఫికెట్లు అందజేశారు.
సల్కం చెరువు స్థలంలో ఫాతిమా ఒవైసీ కళాశాలను నిర్మించినట్టు హైడ్రా అధికారులు గుర్తించడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ, చెరువు హద్దులుపై కోర్టు నివేదిక కోరింది. మూడు నెలల గడువు ఇచ్చినా వివరాలు ఇవ్వలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వ భూములపై వారం రోజుల వ్యవధిలో పూర్తి నివేదిక దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడంతో సల్కం చెరువు అంశంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.