హైదరాబాద్ : కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖకు చెందిన అధికారులతో తెలంగాణ మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. ధాన్యం సేకరణ వ్యవహారంపై అధికారులతో నేతలు చర్చిస్తున్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై సాగు చేయాలని ప్రభుత్వం సూచించింది.
రాష్ట్ర బీజేపీ నేతలు రైతులు వరి సాగు చేయాలని చెప్పడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించిన నేపథ్యంలో.. దేశంలో ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఇకపై బాయిల్డ్ రైస్ కొనమంటూ కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వెలువడింది. శనివారం మంత్రులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్రమంత్రులు, అధికారులను కలువాలని నిర్ణయించి.. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఈ మేరకు ఆదివారం ఢిల్లీకి మంత్రులు, అధికారుల బృందాలతో కలిసి సీఎం ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఇవాళ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి స్పష్టత కోసం అధికారులతో సమావేశం అయ్యారు. భేటీలో ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్రావు, రంజిత్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మాలోతు కవిత, లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్ పాల్గొన్నారు.