మహిళలకు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తారని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ల్లాగా మోసం చేయరని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలు లక్షలకు లక్షలు ఎగ్గొట్టరని, బ్యాంకులను ముంచరని అన్నారు. సెర్ప్ వార్షిక ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. లక్షల కోట్లు ఎగ్గొట్టరు. బ్యాంకులను ముంచరని, అందుకే మహిళా సంఘాలకు విరివిగా నిధులు రుణాలుగా ఇవ్వాలని మంత్రి సూచించారు.
వాళ్లు చెల్లించ గలిగినంత చూసి వీలైనంత ఎక్కువ రుణాలు ఇవ్వాలని, వీరి ద్వారా బ్యాంకులు కూడా బాగుపడతాయని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా కూడా మేము ఐకేపీ, స్త్రీ నిధి ద్వారా మహిళలకు కోట్లాది రూపాయలు రుణాలు ఇస్తున్నామని, వంద శాతం తిరిగి చెల్లిస్తున్నారని మంత్రి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
మహిళల స్వయం సమృద్ధి దేశానికి మంచిదని, మహిళలు కూడా రుణాలు పొంది వ్యాపారం చేయండని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. మహిళల్లో పట్టుదల, ఆత్మాభిమానం ఎక్కువ అని, ముఖ్యంగా కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలని మహిళలను కోరారు. మహిళలు ఎదిగితే, రాష్ట్రాలు, దేశం బాగుపడతాయన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం వల్ల, తెలంగాణ ప్రభుత్వ సానుకూల నిర్ణయాల వల్ల మంచి, శాంతి యుత, ప్రశాంత, పారిశ్రామిక వాతావరణ నెలకొందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.