నిజామాబాద్ : డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా, రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత ప్రాతిపదికన ఇండ్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల (Double Bed Rooms) ఇళ్ల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఒకే సముదాయంలో అన్ని వసతులతో మొత్తం 224 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించగా, తొలివిడతగా 155 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశామని ఆయన అన్నారు. లబ్ధిదారుల కోరిక మేరకు సముదాయానికి కేసీఆర్ కాలనీ (KCR Colony) గా నామకరణం చేశారు. మోర్తాడ్ లో డబుల్ నిర్మాణాల కోసం రూ. 15 కోట్లు మంజారు చేయించానని, అందులో రూ. 13.5 కోట్లు ఇళ్ల నిర్మాణాలకు వెచ్చించగా మిగతా నిధులతో రోడ్ల నిర్మాణాలు జరిపించామని వివరించారు.
అర్హులైన వారిని ఎంపిక చేసేలా అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సైతం జోక్యం చేసుకోకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇళ్లను పంపిణీ చేస్తామని భరోసా కల్పించారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ రవి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్, ఆర్ అండ్ బీ ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, డీఎల్పీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.