హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎంపీ అర్వింద్ తన భాష మార్చుకోవాలని, లేకపోతే నిజామాబాద్ ప్రజలు ఉరికించి కొడుతారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు సరైనవేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కుట్ర బయటపడి దేశమంతా ఛీకొడుతున్న వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ కొత్త డ్రామాలకు తెరలేపిందని మండిపడ్డారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు వీ గంగాధర్గౌడ్, రాజేశ్వర్రావు, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో అర్వింద్ లాంటి కుసంస్కారి మరొకరు లేరని, ఎంతోమంది ఎన్నివిధాలా హితవు చెప్పినా ఆయన తన ప్రవర్తనను మార్చుకోవటంలేదని వేముల విమర్శించారు. కుటుంబ వ్యవస్థ గౌరవాన్ని అర్వింద్ అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ తండ్రైనా తన కన్నబిడ్డను అమ్ముకోరనే కనీస ఇంగితాన్ని మరచి అర్వింద్ ఏకంగా సీఎం కేసీఆర్పై నీచాతినీచంగా వ్యాఖ్యానించటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యల వీడియోను మీడి యా ముందు మంత్రి వేముల ప్రదర్శించారు.
అర్వింద్కు ఊరూరా నిరసన సెగ
నిజామాబాద్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్పేపర్ రాసిచ్చి విఫలమైన వ్యక్తి అర్వింద్ అని మంత్రి వేముల విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో అర్వింద్ను గ్రామాల్లోకి రానివ్వని వాతావరణం నెలకొన్నదని, ఎక్కడికిపోయినా ప్రజలు నిలదీస్తున్నారని వివరించారు. తన రాజకీయ స్వార్థం కోసం నాయకుల వ్యక్తిత్వాలపై అర్వింద్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్వింద్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగడం దురదృష్టకరమన్నారు. అమెరికాలో అద్భుతమైన జీవితాన్ని, జీతాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో తండ్రికి.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బాసటగా నిలిచారని చెప్పారు. నాడు ఉద్యమంలో, నేడు రాష్ట్ర ప్రగతిలో వారు భాగస్వాములయ్యారని తెలిపారు. అలాంటి ప్రజానాయకులపై అర్వింద్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని వేముల ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లికార్జున్ ఖర్గేతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారంటూ అర్వింద్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
అప్పుడెందుకు గవర్నర్ స్పందించలేదు?
ఎంపీ అర్వింద్ ఇంటి వద్ద జరిగిన ఘటనపై పోలీసు నివేదిక కోరిన గవర్నర్.. నాడు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి సమయంలో స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహరిస్తున్న తీరు ఆమె విజ్ఞతకు సంబంధించిందని పేర్కొన్నారు. ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు భావించే ఎమ్మెల్సీ కవితను తండ్రి అమ్ముకున్నాడని ఒక ఎంపీ కామెంట్ చేస్తే, దాన్ని తప్పని సూచించాల్సిన బాధ్యత గవర్నర్కు లేదా? అని ప్రశ్నించారు. ఒక మహిళా ప్రతినిధిపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్రెడ్డి, విజయశాంతి లాంటి బీజేపీ నాయకులు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వాలను, కుటుంబాలను విచ్ఛిన్నం చేయటమే బీజేపీ విధానమా?
ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోయటం, కుటుంబాలను విచ్ఛిన్నం చేయటమే బీజేపీ విధానంగా మారిందని మంత్రి వేముల మండిపడ్డారు. తన దగుల్బాజీ రాజకీయాల కోసం బీజేపీ మహారాష్ట్రలో శరద్పవార్, ఉత్తరప్రదేశ్లో ములాయంసింగ్ యాదవ్, జార్ఖండ్లో హేమంత్ సొరేన్, బీహార్లో రామ్విలాస్ పాశ్వాన్, కృష్ణ పటేల్ కుటుంబాల్లో చిచ్చుపెట్టిందని ఆయన ఉదహరించారు. తల్లికి బిడ్డకు, అన్నకు తమ్ముడికి కొట్లాటలు పెట్టి ఉత్తరాదిలో కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేసినట్టే తెలంగాణలో చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు.
దారి మళ్లించే దగుల్బాజీ రాజకీయాలు
బీజేపీ దుర్మార్గ రాజకీయాలపై దేశం అంతా నివ్వెరపోతున్నదని, ఎమ్మెల్యేలకు ఎర అందుకు నిదర్శమని మంత్రి వేముల చెప్పారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ చేస్తున్న విషపన్నాగం వీడియో, ఆడియోటేపుల ద్వారా వెల్లడైందని, దర్యాప్తులో రోజుకో పేరు తెరపైకి రావటంతో ఏం చేయాలో తోచక బీజేపీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు డ్రామాలు ఆడుతున్నదన్నారు. ప్రజల్లో బీజేపీ అభాసుపాలైందని చెప్పారు.
ఒక్క ఇంట్లో 3 పార్టీలు
అర్వింద్ నీతి, నిజాయితీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. తండ్రి ఒక పార్టీలో, అన్న కాంగ్రెస్లో, తాను బీజేపీలో ఇలా ఒక్క ఇంట్లోనే ముగ్గురు మూడు పార్టీల్లో ఉన్న కుటుంబం.. కుటుంబ రాజకీయాలపై మాట్లాడటంలో అర్థం లేదని చెప్పారు. కాంగ్రెస్తో కుమ్మక్కై అర్వింద్ గెలిచారని.. కుట్ర, బజారు రాజకీయాలు చేయటం ఆయనకే చెల్లుతాయని అన్నారు.
రాజకీయాలను దిగజార్చిన బండి, అర్వింద్
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాకే తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయని ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఒకవైపు సంజయ్, మరోవైపు అర్వింద్ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని.. రాజకీయ విలువలను దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణను దేశానికే తలమానికంగా నిల్పుతున్న సీఎం కేసీఆర్ను బండి సంజయ్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అనటాన్ని వేముల తీవ్రంగా ఖండించారు. మోదీయే ఫెయిల్యూర్ ప్రధాని అని విమర్శించారు. తలసరి ఆదాయం, రూపాయి విలువ పతనం, ఆకాశాన్ని తాకిన ధరలు.. ఇలా అన్ని రంగాల్లో దేశాన్ని బీజేపీ ఆగం చేసిందని విరుచుకుపడ్డారు.
మహిళలే బుద్ధి చెప్తారు: ముత్తిరెడ్డి
ఎంపీ అర్వింద్కు మహిళలే తగిన బుద్ధి చెప్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు. ఆయన జనగామ జిల్లా నర్మెటలో మీడియాతో మాట్లాడుతూ.. అర్వింద్ ఒక అజ్ఞానిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్వింద్కు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి పసుపు బోర్డును సాధించాలని సవాల్ చేశారు.
ఎమ్మెల్సీ కవితను దూషించడం హేయం
బతుకమ్మ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం హేయమైన చర్య. రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ నేతలు ఇలా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే బీజేపీ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.
– కోలేటి దామోదర్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ చైర్మన్
రాష్ర్టాన్ని బెంగాల్ చేయాలని బీజేపీ కుట్ర
రాష్ట్రంలో పశ్చిమబెంగాల్ తరహా రాజకీయాలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. హింసా రాజకీయాలతో ప్రయోజనం పొందాలన్న కుట్రలో భాగంగానే అర్వింద్ బట్టకాల్చి మీద వేసే వ్యవహారానికి దిగారు. ప్రజలను రెచ్చగొట్టడం, ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం అర్వింద్కు పరిపాటిగా మారింది.
-ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్
దళితులు, స్త్రీలంటే బీజేపీకి పట్టింపులేదు
బీజేపీకి దళితులు, స్త్రీలు అంటే పట్టింపులేదు. ఎమ్మెల్సీ కవితపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం. అర్వింద్కు తప్పులు చేయడం పరిపాటిగా మారింది. అర్వింద్ మరోసారి ఇష్టారీతిగా నోరుపారేసుకుంటే నిజామాబాద్ నుంచి బట్టలిప్పించి హైదరాబాద్కు పంపిస్తాం.
-ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు
హద్దు మీరితే బుద్ధి చెప్తాం
ఎంపీ అర్వింద్ భాష శృతి మించిపోయింది. ఓపిక, సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఇక నుంచి హద్దు మీరితే బుద్ధి చెప్తాం. రాష్ట్రంలో ఇంతమంది నాయకులున్నా ఎవరూ అర్వింద్, బండి సంజయ్లా వ్యవహరించడం లేదు. బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే అర్వింద్ ఇంటిపై దాడి చిన్నదే. బీజేపీలో ఎంతోమంది నాయకులున్నా ఒక్క అర్వింద్ ఇంటిపైనే దాడి ఎందుకు జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవాలి.
-ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా
ఆడబిడ్డలను గౌరవించాలి: సండ్ర
ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని ఎంపీ అర్వింద్ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హెచ్చరించారు. తెలంగాణ సంప్రదాయాలు, ఆడబిడ్డలను గౌరవించడం ఎంపీ అర్వింద్ నేర్చుకోవాలని హితవు చెప్పారు. పసుపు రైతులకు కన్పించకుండా తప్పించుకుని తిరుగుతున్న అర్వింద్కు కవిత గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు.
అనుచిత వ్యాఖ్యలు సహించం
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యా ఖ్యలు చేస్తే సహించం. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఎమ్మెల్సీ కవితపై వ్యక్తిగత దూషణలు చేస్తే స హించేది లేదు. అర్వింద్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మహిళా లోకం ఆగ్రహానికి గురికాక తప్పదు.
-ఆడెపు వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ రాష్ట్రఅధక్షురాలు