బేగంపేట్, డిసెంబర్ 11: తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై క్రిస్టియన్ మత పెద్దలు, వివిధ చర్చిల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను ఘనంగా జరుపుకొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు నూతన దుస్తులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 13 నుంచి క్రిస్మస్ గిఫ్ట్లను అందజేస్తామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో 8 ప్రాంతాల్లో క్రైస్తవులకు క్రిస్మస్ విందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.