హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి, కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డెయిరీ టర్నోవర్ రూ. 750 కోట్లకు చేరిందన్నారు. రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల పాల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు.
రోజుకు 162.68 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. పాలిచ్చే పశువుల పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75 శాతం సబ్సిడీ, ఇతర లబ్దిదారులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రూ. 246.25 కోట్లతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో మెగా డెయిరీకి శంకుస్థాపన చేశామన్నారు. విజయ డెయిరీని విస్తరిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. పాలు ఉత్పత్తి చేస్తున్న రైతులకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు.
పాల రైతుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు. మొబైల్ వెహికల్స్ అందించామన్నారు. వెటర్నరీ హాస్పిటల్తో పాటు సంచార వాహనాలను ఏర్పాటు చేసి మెడిసిన్స్ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పాడి సంపద పెంచుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మండలాల వారీగా కమిటీలు వేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో పాడి పరిశ్రమకు మరింత డిమాండ్ రానుంది. కో ఆపరేటివ్ డెయిరీలకు తోడ్పాటును తప్పకుండా అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.