నల్లగొండ : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లిలోని అంగడి బజార్ లో మంత్రి తలసాని స్థానిక రైతులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధర లభించక రైతులు ఎంతో నష్టపోయారని, వ్యవసాయం అంటే దండగా అని భావించే వారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పంట పెట్టుబడుల కోసం ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, సకాలంలో విత్తనాలు అందుబాటులో ఉంచడం, నూతన సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణంతో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పారు. అంతే కాకుండా రైతులు పండించిన ధాన్యం కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే రైతు బీమా కింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటున్నదని పేర్కొన్నారు.
అనేక విధాలుగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి రైతులపై భారం మోపుతుందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎరువులు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పెట్టుబడులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. రైతులకు చేయూత అందించి ఆదుకోకపోగా పెనుభారం మోపడం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల లో ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అన్ని రకాలుగా అండగా ఉంటూ మీ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు.