హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. సనత్ నగర్లోని అశోక కాలనీలో మైనార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు అభివృద్ధి, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, ఏం చేశారని ఓట్లెయాలో చెప్పాలని ప్రశ్నించారు.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందన మండిపడ్డారు. రెండు సీట్లు గెలవని బీజేపీ బీసీని ముఖ్యమంత్రి(BC CM) ని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాల లో చేశామని, అభివృద్ధి పనులు కండ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు.
నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారని, తన గెలుపు ఖాయమని, కానీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లా ఖాన్, కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, నాయకులు ఖలీల్, నోమాన్, ఇబ్రహీం, అంజద్, జమీర్, పాజిల్, కరీం లాలా, అఫ్జల్, షౌకత్, షకీల్, పరీద్ తదితరులు పాల్గొన్నారు.