హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని విమర్శించడం పద్ధతేనా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీది రహదారి అయితే.. బీజేపీది అడ్డదారి అని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. శివరాజ్ సింగ్ చౌహాన్ దొడ్డిదారిలో సీఎం అయ్యారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి వల్ల ప్రపంచం ముందు దేశానికి పేరు వస్తుంది నిజం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి మతిభ్రమించినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
తెలంగాణ అంటే ఏంటో మీ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతిని అడిగి తెలుసుకోవాలని చౌహాన్కు మంత్రి సూచించారు. చౌహాన్ ఇంకో పది సార్లు సీఎం అయినా మధ్యప్రదేశ్ను అభివృద్ధి చేయలేరు అని స్పష్టం చేశారు. మాకు తిక్కలేస్తే మేము మధ్యప్రదేశ్ లో మీటింగ్ పెట్టి తామేంటో చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.