మహబూబాబాద్ : గతంలో ఉన్న మానుకోటకు ఇప్పుడు ఉన్న మానుకోటకు బేరీజు వేసుకోవాలి. దశాబ్దాలపాటు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyawathi )అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోరుతూ మహబూబాబాద్లోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ఇన్వర్టర్లో ఉండేవి. బెంగళూరు పట్టణాల్లో కరెంటు లేదు. రాహుల్, ప్రియాంక గాంధీ నమ్మి ఓట్లు వేస్తే కర్ణాటక నడిరోడ్డు మీదకు వచ్చింది. ఆ రాష్ట్రం ఆగమాగం అయిపోయింది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం పదేళ్లలోనే సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు వస్తాయి. చీకటి కష్టాలు మొదలు అవుతాయి. ఈ నియోజకవర్గం అభివృద్ధి మరింత జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.