హైదరాబాద్ : ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)పై దాడి ఘటనను విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha indrareddy) తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని, హింసతో ఏమీ సాధించలేరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
దాడుల సంస్కృతి మంచిది కాదని నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోని ప్రజా జీవితంలోకి తిరిగి క్షేమంగా రావాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా, ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బంద్(Dubbaka bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. వ్యాపార సంస్థలు, దుకాణాలు, పాఠశాలలు, మార్కెట్లు స్వచ్ఛందంగా మూసివేశారు.
దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.