హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): పిల్లలు కోరుకున్న కోర్సుల్లోనే చేర్పించాలే, తప్ప బలవంతంగా ఇష్టంలేని కోర్సుల్లో చేర్పించవద్దని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. కాలేజీలు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు కోర్సు పూర్తికాగానే ప్లేస్మెంట్లు ఇప్పించేలా కృషిచేయాలని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని, ఇదే ఒరవడిని కొనసాగించాలని అన్నారు. షెడ్లలో కొనసాగుతున్న కాలేజీలను మూసివేసి, నాణ్యతకు పెద్దపీట వేసిన కారణంగా రాష్ట్రం మేటిగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్లోని నిజాంకాలేజీ మైదానంలో టీ న్యూస్ నిర్వహించిన ‘గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్-22’ను మంత్రి ప్రారంభించారు. పలు స్టాళ్లను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంసెట్లో 81 శాతం విద్యార్థులు క్వాలిఫై అయ్యారని, వారందరికీ టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ భరోసా ఇస్తుందని చెప్పారు. టీ న్యూస్ మీడియాగా తన వంతు పాత్రను పోషిస్తూనే.. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. 80 వేల పైచిలుకు ఉద్యోగాలను దశలవారీగా భర్తీచేయనున్నామని, ప్రైవేట్రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు విశేషంగా కృషిచేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో తెలంగాణలో ఉన్నన్నీ ఉద్యోగాలు మరే రాష్ర్టాల్లో లేవని అన్నారు.
మంత్రి కేటీఆర్ నిరంతరం పెట్టుబడులను రాష్ర్టానికి తెచ్చేందుకు విశేషంగా ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. ఎంసెట్కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇంటర్బోర్డు ద్వారా ఉచిత శిక్షణనిస్తున్నామని, కౌన్సెలింగ్కు హాజరయ్యే వారికి ఉన్నత విద్యామండలిలో రెండు హెల్ప్లైన్లను ఏర్పాటు చేశామని, విద్యార్థులు 76600 09768/69 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
పలు రాష్ర్టాల నుంచి వలసలు
రాష్ట్రంలోని విద్యావసతులు, వాతావరణం, ఎకోసిస్టం కారణంగా రాష్ర్టానికి విద్యావలసలు పెరుగుతున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు. జాతీయంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26 శాతంగా ఉంటే, మన రాష్ట్రంలో 36 శాతంగా ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో పలు కాలేజీల ప్రతినిధుల వెంకటేశ్వర్రెడ్డి (ఎంఎల్ఆర్ఐటీ), ఉదయ్రెడ్డి (శ్రేయాస్), కొమురయ్య (పల్లవి), కోహ్లి (గురునానక్), పాండురంగారెడ్డి (శ్రీదత్త), కొమ్మూరి ప్రశాంత్ (కేపీఆర్ఐటీ), వినయ్బాబు (స్టాన్లీ), టీన్యూస్ సీజీఎం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.