ఖమ్మం: మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, MLC తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియ నాయక్, రాములు నాయక్, మేయర్ నీరజ, పోలీసు కమిషనర్ విష్ణు వారియర్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, BC సంఘం నాయకులు తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘట్టించారు.
అనతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అక్కడ కొండా చిత్రపటానికి వారు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘట్టించారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు.
బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను మంత్రి పువ్వాడ స్మరించుకున్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తితోనే కేసీఅర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళి, బొమ్మ రాజేశ్వరరావు, పగడాల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.