హైదరాబాద్ : హైటెక్ సిటీలోని న్యాక్( నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)లో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో ఇప్పటికే త్రిసభ్య కమిటీ వేశామని, ఆ నివేదిక రాగానే వర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
శనివారం నిర్వహించిన న్యాక్ 42వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాక్లో పలు బ్లాక్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. న్యాక్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల అనుభవాలను ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యార్థులకు న్యాక్ కల్పిస్తున్న ఉద్యోగ నియామకాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు న్యాక్ అనే సంస్థ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. కొవిడ్ సమయంలోనూ న్యాక్ పని చేసిందని గుర్తు చేశారు. గతేడాది 19 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ఈ సంవత్సరం 20 వేల మందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాం అని తెలిపారు. బీటెక్ చదివిన వారికి న్యాక్ ఆధ్వర్యంలో ఒక ఏడాది పీజీ విద్యను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్లాబ్ పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ అంశానికి సంబంధించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాను అని మంత్రి పేర్కొన్నారు.