Ponnam Prabhakar | బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధించడం తప్ప బీజేపీ చేసింది ఏమైనా ఉందా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ ఏమి ఒరగబెట్టిందని ఓట్లు అడుగుతుందని మంత్రి నిలదీశారు.
గాంధీభవన్లో శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అవమానించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజనను బీజేపీ వ్యతిరేకించిందని అన్నారు. అలాంటి పార్టీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టానికి ఏం చేశారో చెప్పాలని ప్రధాని మోదీని నిలదీశారు. విభజన చట్టంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చనందుకు ఓటు వేయాలా? తెలంగాణకు ఏమి చేయనందుకు ఓటు వేయాలా? ఏడు మండలాలతో పాటు విద్యుత్ కేంద్రాలను ఆంధ్రకు అప్పజెప్పినందుకు ఓటు వేయాలా? అని మంత్రి పొన్నం నిలదీశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. చేనేత పరిశ్రమపై ఆధారపడిన కార్మికులకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీ దళితులకు, బీసీలకు, మైనారిటీలకు వ్యతిరేకమని విమర్శించారు. ‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు’ ఇస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ హయాంలో చేసింది ఏమిలేక కేవలం భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.
అయోధ్య రాముడి పేరున అక్షింతలు, కుంకుమ ప్రజలకు పంచి ఓట్లు అడుగుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్రెడ్డి సికింద్రాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు.
పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలపై ఈ నెల 14న కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీజేపీ హయాంలో తెలంగాణకు చేసింది ఏమిటో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.