హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నానో యూరియా తయారీ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పునకు సంకేతమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఈ యూరియా వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు. దక్షిణ భారతదేశానికి అందుబాటులో ఉండేలా తెలంగాణలో నానో యూరియా తయారీ ప్లాంటు ఏర్పాటుచేయాలని ఇఫ్కో సంస్థను కోరారు. గుజరాత్ రాష్ట్రం కలోల్లోని ఇఫ్కో సంస్థకు చెందిన నానో (లిక్విడ్) యూరియా తయారీ ప్లాంట్ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నదని, ఇక్కడ ప్లాంటు పెడితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఆ సంస్థ వైస్ చైర్మన్ దిలీప్ సంగానియా.. ఇఫ్కో బోర్డు సమావేశంలో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నానో యూరియా తయారుచేసిన శాస్త్రవేత్త రమేశ్ రాలియాను మంత్రి నిరంజన్రెడ్డి అభినందించారు. అనంతరం సబర్కాంఠ జిల్లా ఓరన్లో దేవస్య న్యూట్రిషన్ సంస్థవారి వేరుశనగ ఆధారిత పీనట్ బట్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఆయన పరిశీలించారు. వేరుశనగ సాగులో గుజరాత్ తర్వాత తెలంగాణ ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. రైతులకు లాభాలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో అప్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తి అవుతున్నదని, దీనికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో కలోల్ యూనిట్ హెడ్ ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త జీఎం రమేశ్ రాలియా, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తదితరులు ఉన్నారు.