వనపర్తి : జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో సర్వ వర్గ సామూహిక భవనాలు(ఫంక్షన్ హాల్స్) నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడు మండలాల్లో రూ. 75 లక్షల చొప్పున వ్యయంతో నిర్మిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజల మధ్య సఖ్యత ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దమందడిలో రూ.75 లక్షలతో నిర్మించే సర్వవర్గ సామూహిక భవనానికి మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల శుభకార్యాలకు ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు. అర్హులయిన పేదలందరికీ విడతల వారీగా డబల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామగ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలుగుతారని చెప్పారు. మైదానాలను యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులను పెంచేందుకు గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి చెప్పారు.
ఖిల్లాఘణపురం మండలం అల్లమాయపల్లిలో రూ.1.60 కోట్లతో నిర్మించే సబ్ స్టేషన్కు, 16 డబల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో తెలంగాణ క్రీడాప్రాంగణం ప్రారంభించారు. పెద్దమందడి మండలం
చీకటి చెట్టుతండాలో రూ.16 లక్షలతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అల్వాల, దొడగుంటపల్లిలో క్రీడాప్రాంగణాలు ప్రారంభించి, పెద్దమందడిలో రూ.75 లక్షలతో నిర్మించే సర్వవర్గ సామూహిక భవనానికి, వనపర్తి మండలం అచ్యుతాపురంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, వాల్మీకి కమ్యూనిటీ హాల్, వైకుంఠధామం మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.