హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 22 నుంచి 29 వరకు మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి మంత్రి కేటీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్’ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్స్టాడ్ ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో జరిగే సదస్సులో మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి రాష్ట్ర వ్యవసాయ ప్రగతిపై ప్రసంగించనున్నారు. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీద ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో ఆహార భద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వివిధ దేశాల నుంచి సుమారు 1200 మంది అధికారులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డితోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, తెలంగాణ సీడ్స్ ఎండీ డాక్టర్ కేశవులు వెళ్లనున్నారు.