హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణపై మరోసారి విషం చిమ్మిన ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరుల గురించి ఉచ్చరించే అర్హత లేదని తేల్చిచెప్పారు. మోదీ ప్రభుత్వంలో మాటలే తప్ప, చేతలు లేవన్నారు. స్వచ్చభారత్, భేటీ బచావో – భేటీ పడావో, జన్ ధన్, నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా ఇలా అన్ని పథకాలు, నినాదాలు, విధానాలు విఫలమైనవే అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేదని స్పష్టం చేశారు. మోదీ అత్యాశకు పోతున్నారని నిప్పులు చెరిగారు.
మోదీ, అమిత్షాలు దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో రూ. 100 లక్షల కోట్ల అప్పుచేసిన మోదీ రేపు ఆగస్టు వరకు మరో రూ. 8 లక్షల కోట్ల ప్రతిపాదనలు తయారుచేసి పెట్టాడని మంత్రి తెలిపారు. రూ. 4 వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేసిన మోదీ, రూ.11 లక్షల కోట్ల కార్పోరేట్ అప్పులను మాఫీ చేయడం దారుణమన్నారు.
గుజరాత్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు దేశ ప్రధానిగా ఉండి గుజరాత్లో కనీసం 24 గంటల కరెంటు ఇవ్వలేకపోయిన వ్యక్తి మోదీ అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నింపడం చేతగాని మోదీ.. యువకుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నిస్సిగ్గుగా తెగనమ్మి దేశాన్ని అధోగతి పాలు చేసింది మోదీనే అని మంత్రి నిప్పులు చెరిగారు.
మేకిన్ ఇండియాను నినాదానికి పరిమితం చేసి సేల్ ఇండియాను పరిచయం చేశారని ఎద్దెవా చేశారు. ప్రపంచదేశాల ముందు భారత్ను నవ్వులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధవిశ్వాసాలను నమ్మనంటున్న మోదీ అంధ భక్తులను తయారుచేసి పబ్బం గడుపుకుంటున్నాడని పేర్కొన్నారు. వాట్సప్ యూనివర్శిటీలో కట్టుకథలు తయారుచేసి, ప్రచారం చేస్తూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో హింసను రెచ్చగొడుతున్నారని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు.