హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పంట నష్టంపై దీక్ష చేస్తానంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, దీనిపై నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. రైతుల సాకుతో దొంగ దీక్షలు మానుకోవాలని సూచించారు. అకాల వర్షాలు కురిసిన 24 గంటల్లోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తాను వికారాబాద్ జిల్లాలో పర్యటించానని, దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుంటే రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగేండ్లలో కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని సమస్యల మీద ఎన్ని దీక్షలు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ధాన్యం కొనేదిలేదని కేంద్రం తేల్చి చెబితే ఒక కాంగ్రెస్ నేత ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు దీక్షలు చేయలేదు ?అని నిలదీశారు. అకాల వర్షాలతో జరిగిన పంటనష్టం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి వ్యవసాయ అనుకూల విధానాలతో దేశంలోనే అగ్రగామిగా సాగుతున్నదని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని వివరించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యు త్తు, సాగునీటి కల్పనతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, రాష్ట్రంలో ప్రతి ఏటా వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు.