హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో మైనారిటీల జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్ముతున్నాయి. నిరుపేద ముస్లిం యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇప్పించడమే కాకుండా సబ్సిడీ రుణాలు అందజేసి, తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహిస్తున్నది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గడిచిన మూడేండ్లలో 4,728 మందికి రూ.54.71 కోట్ల సబ్సిడీ రుణాలు అందించి, స్వయం ఉపాధికి బాటలు వేసింది. దాదాపు పదివేల మంది యువతకు కుట్టుమెషిన్లు అందజేసింది. గత మూడేండ్లలో 7,474 మందికి ఐటీ, మార్కెటింగ్ తదితర రంగాల్లో శిక్షణ ఇప్పించగా వీరిలో 5,231మంది పేరున్న సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. మరో 2,243 మంది స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని జీవనం సాగిస్తున్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఓనర్లుగా మారుతున్న డ్రైవర్లు
ఆటో, కారు డ్రైవర్లుగా జీవితాన్ని నెట్టుకొస్తున్నవారికి డ్రైవర్ కమ్ ఓనర్ పథకం వరంలా మారుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటివరకు 1,800 మంది ఆటోడ్రైవర్లు ఈ పథకం ద్వారా లబ్ధిపొంది, యజమానులయ్యారు. రూ.7,56,09 యూనిట్ కాస్ట్లో రూ. 4,62,716 సబ్సిడీ, రూ. 2,43,374 బ్యాంక్రుణం, లబ్ధ్దిదారుని వాటా రూ.50 వేలు గా నిర్ధారించిన ఈ పథకానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 14,351 మంది దరఖాస్తు చేశారు. ఈ పథకం కింద తొలిదశలో 300 మందిని ఎంపికచేసి, ఇటీవలే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 106 మందికి మారుతీ క్యాబ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. దశలవారీగా అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం కింద కార్లను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు.
ఫకీర్లకు ఉచితంగా మోపెడ్లు
సైకిళ్ల మీద తిరుగుతూ అగర్బత్తీలు, పూలు, కూరగాయలు లాంటివి అమ్ముకొని కడు పేదరికంలో జీవిస్తున్న ఫకీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మోపెడ్లను అందజేసి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది. ఇప్పటికే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వంద మంది ఫకీర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేల విలువచేసే మోపెడ్లను ఉచితంగా అందించడం విశేషం. ముస్లింలలో అత్యంత నిరుపేదలైన ఫకీర్లను తొలిసారిగా అక్కున చేర్చుకొన్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది.