Minister KTR | కామారెడ్డి : ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )పై బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) సెటైర్లు వేశారు. ఆయన మహానటుడు అని.. ఆస్కార్( Oscar )కు పంపితే అవార్డు వచ్చేదని మోదీని ఉద్దేశించి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా( Kamareddy ) జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు.
నిన్న గాక మొన్న మన తెలుగు సినిమా( telugu Cinema )కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలోని నాటు నాటు పాట( Naatu Naatu Song )కు ఆస్కార్ అవార్డు వచ్చింది. మన పాటకు అవార్డు వచ్చింది. కానీ మన దేశంలో అద్భుతమైన మహానటుడు ఒకాయన ఉన్నాడు. ఆ మహానటుడిని కూడా పంపితే ఆయన నటనకు కూడా ఆస్కార్ అవార్డు తప్పకుండా వచ్చేది. ఆ మహానటుడు ఎవరో మీకు యాదికి ఉన్నాడా..? అని కేటీఆర్ ప్రశ్నించగానే సభికుల నుంచి మోదీ అంటూ నినాదాలు వినిపించాయి.
2014లో మోదీ ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశం మొత్తం సంపద దోచి వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నాడు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద పడుతున్నాడు. పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని, దేశాన్ని ఆగం చేయాలి. ఇక్కడికి వచ్చిన అద్భుతమైన నటన ప్రదర్శించాలి. మహానటుడు అని ఉత్తగనే అనలేదు. ఇలా నాటకాలు ఆడుతున్నందుకే మహానటుడు అని అన్నాను అని కేటీఆర్ తెలిపారు.
రైతుల ఆదాయం డబుల్ చేస్తాను అన్నాడు. కానీ రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అన్నాడు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నల్లధనం తెస్తానని చెప్పిండు. దాన్ని గురించి అడిగితే తెల్ల ముఖమేస్తుండు.. తప్పించుకుని తిరుగుతుండు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
నీ దిక్కుమాలిన ప్రభుత్వం వల్ల.. సిలిండర్ ధరలు పెరిగాయని మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి 2014 ఎన్నికల సమయంలో ఇదే మోదీ వ్యాఖ్యానించారు. దద్దమ్మ ప్రధాని అని మన్మోహన్ను అన్నారు. ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1200 అయింది. మరి రూ. 400 ఉన్నప్పుడు దద్దమ్మ అయితే.. సిలిండర్ ధర రూ. 1200 ఉన్నప్పుడు ఈ ప్రధానిని ఏమనాలి.. దద్దమ్మ, సన్నాసి, ఇంకా ఏమనాలి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు సిలిండర్కు దండం పెట్టుకోవాలి.. వీపు పగులగొట్టాలి.. ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయాలి అని కేటీఆర్ సూచించారు.
అన్ని నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని కేటీఆర్ పేర్కొన్నారు. మాటలు తప్ప ఒక్క పని చేసింది లేదు. ప్రధాని తెలంగాణ మీద కక్ష కట్టిండు. మెడికల్, నర్సింగ్, నవోదయ కాలేజీలు ఇవ్వడు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి అనేక హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. అయినా సిగ్గు లేకుండా ఇక్కడొచ్చి మాట్లాడుతున్నారు అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.