మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలం వినోభానగర్ అటవీ ప్రాంతంలో నాటుబాంబు కొరికిన పెంపుడుకుక్క అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం ఉదయం వినోబానగర్కు చెందిన అశోక్ అనే గొర్రెల కాపరి తన గొర్రెలతో అటవీ ప్రాంతానికి మేపేందుకు వెళ్ళాడు. తనతో పాటు పెంపుడు కుక్క కూడా తోడుగా వెళ్ళింది. సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో నేలపై పడిఉన్న నాటుబాంబును కుక్క కొరికింది. దీంతో బాంబు పేలి కుక్క అక్కడే చనిపోయింది. పలువురు వ్యక్తులు అడవి పందులను చంపేందుకు నాటుబాంబు వేసినట్లుగా సమాచారం. విషయం తెలిసిన బయ్యారం ఎస్ఐ జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు. డీఎఫ్వో నాగమణి కూడా అటవీ ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టారు.