హైదరాబాద్ : నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. బాలానగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఓవర్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్కు బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.
ఈ ఫ్లై ఓవర్ను మూడు సంవత్సరాల 11 నెలల సమయంలో పూర్తి చేశారు. 1.13 కిలోమీటర్ల దూరం.. 24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్ సైతం ఏర్పాటు చేశారు. వాటిలో చక్కటి పూల మొక్కలు నాటారు. ఎల్ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్-కూకట్పల్లి-అమీర్పేట-జీడిమెట్ల వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది.
-నర్సాపూర్ చౌరస్తాగా ప్రసిద్ధి గాంచిన బాలానగర్ చౌరస్తా వాహనాల రాకపోకలకు ఎంతో కీలకం.
-అటు సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లి, ఇటు అమీర్పేట వైపు నుంచి జీడిమెట్ల వైపు వెళ్లే వాహనాలకు బాలానగర్ కేంద్రంగా ఉంది.
-దీంతో ఈ ఫ్లై ఓవర్ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించారు.
-భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ ఫ్లై ఓవర్ పనులను చేపట్టింది.
-అత్యాధునిక ఫ్రీకాస్ట్ టెక్నాలజీని వినియోగించి 1.13 కిలోమీటర్ల దూరంతో ఇరువైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా 6 వరసలతో నిర్మించింది.
-బ్రిడ్జి వెడల్పు 24 మీటర్లు. మొత్తం 26 పిల్లర్లు వేసిన అధికారులు ఆయా పిల్లర్లపై 22 ఆర్సీసీ గడ్డర్లు, 3 స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేశారు.
-ఒక్కో ఆర్సీసీ గడ్డరు పొడవు 30 మీటర్లు.. వెడల్పు 24 మీటర్లు. మూడు స్టీల్ గడ్డర్లు మాత్రం 40 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో స్పాన్లు నిర్మించారు.
-మొత్తం రూ.387 కోట్లు వెచ్చించగా అందులో ైప్లెఓవర్ నిర్మాణ పనులకు రూ.70 కోట్లు, కట్టడాల తొలగింపు, విద్యుత్ లైన్ల తరలింపు, తాగునీటి పైప్లైన్, రోడ్డు పునరుద్ధరణకు రూ.52 కోట్లు, భూ సేకరణ కోసం రూ.265 కోట్లు ఖర్చు చేశారు.
-ఫ్లై ఓవర్పై బీటీ రోడ్డుతో పాటు డివైడర్ను సైతం ఏర్పాటు చేసి పూల మొక్కలతో అందంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో వెలుతురు ఉండేలా ఎల్ఈడీ లైట్లు అమర్చారు.