KTR | యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేదని పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందని తెలిపారు. పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు. తెలంగాణలో సమగ్ర, సమత్యులత, సమ్మిళిత అభివృద్ధి జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే అని గుర్తు చేశారు. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదు అని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
మానవ చరిత్రలో మూడవ అతి పెద్ద కార్యక్రమం మన హరితహారం కార్యక్రమం అని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చటి వాతావరణం అందిస్తున్నామని పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలకు పలు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. తెలంగాణను అవహేళన చేసిన వాళ్ళు కనుమరుగు అయ్యారని పేర్కొన్నారు. 60 ఏండ్లలో జరగని పనిని ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ చేసి చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర దేశాలకు పాఠాలు నేర్పుతుంది అని అమెరికా ఇంజనీర్లు అన్నారు. అది తెలంగాణకు దక్కిన గొప్ప గౌరవం అని కేటీఆర్ స్పష్టం చేశారు.