హైదరాబాద్ : యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన ధర్మపురి నియోజకవర్గ యువతతో టూరిజం ప్లాజాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి లో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. యువత తీసుకుంటున్న నిర్ణయాలతోనే ప్రజల్లో మార్పు వస్తుందని చెప్పారు.
నాయకులు ఎక్కడ గొప్పగా ఆలోచన చేస్తారో అక్కడ అభివృద్ధి ఉంటుందని వెల్లడించారు. గత పాలకులు పల్లె సీమల అభివృద్ధిని విస్మరించాయని, ఇది గుర్తించిన సీఎం కేసీఆర్ పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాల సంఖ్య పెంచి మౌలిక సదుపాయాలు కల్పించారని వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ (Medical College) ఏర్పాటు చేశారని , నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచారని తెలిపారు.
ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఒక సారి గుర్తించాలన్నారు. యువత తీసుకోబోతున్న ఒక మంచి నిర్ణయం వెనుక అనేక మంది జీవితాలు మారుతాయన్నది గమనించాలన్నారు. రానున్న ఎన్నికల్లో నూ యువత ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనం లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన యువకులు కుంటాల రమేష్, గంగాధర్, అశోక్, భాగ్య, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.