ఖైరతాబాద్, జనవరి 8: హైదరాబాద్ ప్రెస్క్లబ్కు గొప్ప పేరు ప్రఖ్యాతలున్నాయని, అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్రంగా, భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వేదికగా విరాజిల్లుతున్నదని, దీని ఔన్నత్యాన్ని పదిలపర్చాలని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ 2022 డైరీని శనివారం సాయంత్రం క్లబ్ ఏసీ ఆడిటోరియంలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మీడియాలోనూ ఇబ్బందులు తలెత్తాయని, ఎన్ని అవాంతరాలు వచ్చినా తెలంగాణ మీడియా ముందుకు సాగుతూనే ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. ప్రెస్క్లబ్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే వనరులు అవసరమని, తన వంతు సాయంగా రూ.5 లక్షలను క్లబ్ సంక్షేమానికి అందిస్తున్నట్టు చెప్పారు. క్లబ్ సభ్యుడిగా భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా వ్యక్తిగతంగా సాయం అందించేందుకు ముందుంటానని తెలిపారు. వేదికేదైనా ప్రతిఒక్కరూ మొక్క నాటాలని, మరో ముగ్గురికి చాలెంజ్ విసరాలని, దీనిని తాను జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నానని పేర్కొన్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రెస్క్లబ్ సంస్కృతి, జర్నలిజం, స్వేచ్ఛా ప్రజాస్వామ్య కార్యకలాపాలకు నిలయంగా ఉందని తెలిపారు. ఫ్యామిలీ క్లబ్గా తీర్చిదిద్దాలని, జర్నలిస్టు కుటుంబాలకు సౌకర్యవంతమైన కేంద్రంగా ఇది అభివృద్ధి చెందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాన్ని అతిథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్తోపాటు బండారి శ్రీనివాస్, నరేందర్రెడ్డి, రవికాంత్రెడ్డి తదితరులను సత్కరించారు. ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎస్ విజయ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బీ రాజమౌళిచారి, ఉపాధ్యక్షులు వేణుగోపాలనాయుడు, రెహనా బేగం, సహాయ కార్యదర్శులు చిల్కూరి హరిప్రసాద్, కంబాలపల్లి కృష్ణ, కార్యవర్గ సభ్యులు వసంత్కుమార్, వీరగోని రజనీకాంత్గౌడ్, అనిల్కుమార్, ఎన్ భూపాల్రెడ్డి, కట్టా కవిత, యశోద, ఉమా తదితరులు పాల్గొన్నారు.
టెన్త్, ఇంటర్లో ప్రతిభకనబర్చిన జర్నలిస్టుల పిల్లలకు ప్రశంసాపత్రాలతోపాటు నగదు పురస్కారాన్ని అతిథులు అందజేశారు. బహుమతులు అందుకున్నవారిలో టెన్త్లో నంద్యాల దినేశ్రెడ్డి, రవనం అమృత, వరగంటి మనోజ్ఞ, సిద్దోజు సాయిక్, ఇంటర్లో సామల వెంకటసాయి శ్రీయారెడ్డి, దాసరి సాయిహర్షిత్, అభినయరెడ్డి పీసటి, కార్తీక్ కొండు, గోపాల మనస్విని, వీరగోని సాయిధీరజ్గౌడ్ ఉన్నారు.