హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న ఉచిత విద్యుత్తుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, తెలంగాణలో ఇచ్చినట్లు మాకెందుకు ఇయ్యడం లేదని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రశ్నిస్తున్నారని, ఈ కారణంగానే కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల యూపీలో బోర్లకు మీటర్లు పెడితే కాల్చేశారని, అన్ని రాష్ర్టాల్లో సాగుకు ఉచిత విద్యుత్తు కావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. సోమవారం శాననమండలిలో ‘కేంద్ర విద్యుత్తు సవరణ బిల్లు-పర్యవసనాలపై’ జరిగిన లఘు చర్చలో పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం జగదీశ్రెడ్డి వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గుజరాత్, యూ పీల్లో సీఎం కేసీఆర్ పేరు తలుచుకోవడమే బీజేపీకి కంటగింపుగా మారిందన్నారు. ‘కేసీఆర్ తెలంగాణ దాటి వస్తుండు.. మేము పాలించే రాష్ర్టాల్లో కేసీఆర్ పేరు వినపడటమేంటన్న ఆలోచనతోనే కేంద్రం..కేసీఆర్ కాళ్లల్లో కట్టెపెట్టి..తెలంగాణను అంధకారంలోకి నెట్టేందుకు యత్నిస్తున్నది.. దేశాన్ని గంపగుత్తగా కొంతమందికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నది’ అని విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నది. ఎలాంటి అధికారాల్లేని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు అపరిమిత అధికారాలు కట్టబెడుతున్నది’ అని మంత్రి మండిపడ్డారు.
బొగ్గు సంక్షోభం కృత్రిమ సృష్టే..
‘దేశంలో బొగ్గు కొరత వాస్తవం కాదు. కేం ద్రమే కృత్రిమంగా సృష్టించింది. సింగరేణి, కోల్ ఇండియాల వద్ద సరిపడా నిల్వలున్నా సంక్షోభానికి దారితీయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. అగ్గువకు దొరికే మన బొగ్గును కాదని..10శాతం విదేశీ బొగ్గును వాడాలం టూ షరతుపెట్టారు. మనదగ్గర మెట్రిక్ టన్ను బొగ్గు రూ.3800-3900 కాదని.. విదేశీ సంస్థల దగ్గర మెట్రిక్ టన్ను రూ.40 వేలకు మోదీ దోస్తుల దగ్గర కొనాల్నా? ఫలానా దుకాణంలోనే కొనాలని టెండరు నిబంధనల్లో పెట్టడం దివాలా కోరుతనం. కేంద్రం పనిచేస్తున్నది ప్రజల కోసమా? లేక కొంతమంది కోసమో అర్థం చేసుకోవాలి. రైతు చట్టాల తరహాలో విద్యుత్తు సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకునే వరకు సీఎం కేసీఆర్ చేసే పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతివ్వాలి’ అని జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
బిల్లును వ్యతిరేకించిన సభ్యులు
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సవరణ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి తీవ్ర వ్యతిరేకమని శాసనమండలి అభిప్రాయ పడింది. ‘కేంద్ర విద్యుత్తు బిల్లు-పర్యవసానాలు’ అంశంపై లఘు చర్చను ఎమ్మెల్సీ మ ధుసూదనాచారి ప్రారంభించారు. ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, కాంగ్రెస్ సభ్యుడు టీ జీవన్రెడ్డి, టీఆర్ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సురభి వాణీదేవి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, బం డా ప్రకాశ్, భానుప్రసాద్, అల్గుబెల్లి నర్సిరెడ్డి, యెగ్గె మల్లేశం, రఘోత్తంరెడ్డి, తాత మధు, డాక్టర్ యాదవరెడ్డి చర్చలో పాల్గొన్నారు. కేం ద్ర విద్యుత్తు సవరణ బిల్లును అన్ని రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, ఈ బిల్లు రాష్ర్టాల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. సభ్యుల చర్చ అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మధ్యాహ్నం 1.30 గంటలకు విరామం ప్రకటించారు. 2 గంటలకు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి వివరణ ఇచ్చారు. అనంతరం శాసనమండలి మంగళవారానికి వాయిదాపడింది.
కిరికిరి కేంద్రమంత్రి ఒప్పుకోవడం లేదు..
‘నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద టీఎస్ జెన్కో 4వేల మెగావాట్ల అల్ట్రా పవర్ప్లాంట్ను నిర్మిస్తున్నది. దీని నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) మధ్య ఒప్పందం కుదిరింది. అయినా నిర్మాణానికి ఇవ్వాల్సిన బిల్లులను ఏప్రిల్ నుంచి నిలిపివేశారు. ఎందుకు నిలిపారని అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, ఆర్బీఐల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగాలంటూ మెలికపెట్టారు. ఉత్పత్తి చేసేది టీఎస్ జెన్కో, నిధులిచ్చేది పీఎఫ్సీ, ఆర్ఈసీ.. కాని కేంద్రం, ఆర్బీఐతో ఎందుకు ఒప్పందం చేసుకోవాలో అర్థం కావడం లేదు. బిల్లులు ఆపేస్తే పనులు ఆగిపోయాయని, బీహెచ్ఈఎల్కు న ష్టం వస్తుందని సాక్షాత్తు కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కేసింగ్కు లేఖ రాసిండు. కిరికిరి కేంద్రమంత్రి ఒప్పుకోవడం లేదు’ పేర్కొన్నారు.