హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ముఖ్య అధికారులతో అరణ్య భవన్లో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చనాక-కొరాట, ప్రాణహిత, నీల్వాయి, జగన్నాథపూర్, కుమ్రంభీం, వార్ధా, కుప్టీ ప్రాజెక్ట్లు, చెన్నూర్, లక్ష్మింపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 27, 28, సదర్మాట్ బరాజ్, కడెం డ్యాంకు కొత్త గేట్ల బిగింపు, గోదావరి పరివాహాక వరద ముంపు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణాలపై సమగ్రంగా చర్చించారు.
తమ తమ నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. పంపుహౌజులు, లిఫ్టులు, కాల్వల నిర్మాణ పురోగతి, అటవీ అనుమతుల అంశాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి, ప్రజాప్రతినిధులకు వివరించారు. లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి అటవీ అనుమతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందుబాటులో ఉన్న పుష్కలమైన నీటి వనరులను సద్వినియోగం చేసుకునేలా సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్లు, బ్యారేజీల నిర్మాణానికి పెద్ద పీట వేశారని గుర్తుచేశారు. వాగులపై రెండో దశ లో మరిన్ని చెక్ డ్యాంలు నిర్మించాల్సిన అవసరముందని, నివేదిక సమర్పించి డిసెంబర్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.