హైదరాబాద్ : ఈ ఏడాది మార్చి 28 నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనాలు కల్పించనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి సుదర్శన మహాయాగం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత 28 నుంచి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
సుదర్శన మహాయాగం సందర్భంగా 21-28 వరకు నిత్యం లక్ష మందికి అన్నప్రసాదం అందజేయనున్నట్లు చెప్పారు. 75 ఎకరాల్లో ఆరువేల రుత్వికులతో పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పనులు 99శాతం పూర్తయ్యాయని, ధ్వజస్తంభం బంగారు తాపడం పనులు నెలాఖరు వరకు పూర్తవుతాయన్నారు. సప్తగోపురాలపై కలశాల బిగింపు ఫిబ్రవరి నెలాఖరు వరకు, క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, దీక్షాపరుల మండలం నెలాఖరు పూర్తవుతాయన్నారు. కొండపై రూ.10కోట్లతో బస్బే పనులు చేపట్టనున్నట్లు వివరించారు.