హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవులకు పూర్వవైభవం వచ్చిందని, రాష్ట్రమంతటా పచ్చదనం పరిఢవిల్లుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.రవీంద్రభారతీలో నిర్వహించిన హరితోత్సవంలో మంత్రి మహమూద్ అలీతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరితహారం ప్రగతి నివేదికను మంత్రులు ఆవిష్కరించారు. ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని పేర్కొన్నారు.
వానలకు, వనాలకు సంబంధం ఉన్నదని వెల్లడించారు. చెట్లు లేకుండా వర్షాలు రావని, అందుకే తెలంగాణలో సమృద్ధిగా వానలు కురిసేందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారాన్ని ప్రారంభించిందన్నారు. ‘వానలు వాపస్ రావాలే..కోతులు వాపస్ పోవాలే’ ‘ జంగల్ బడావో- జంగల్ బచావో’ అనే నినాదంతో సీయం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు.
దూరదృష్టి, రాజకీయం సంకల్ప బలం ఉంటే ఎడారిని కూడా హరితశోభితం చేయొచ్చని కేసీఆర్ నిరూపించారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వీటి అమలు, పర్యవేక్షణ కోసం బలమైన సంస్థాగత ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రజలకు బాధ్యతయుత భాగస్వామ్యం కల్పించడంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. మైదానాలుగా మారిన అడవుల్లో పచ్చదనం పరిఢవిల్లుతుందని, పల్లెలు, పట్టణాలు పచ్చబడ్డాయని తెలిపారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యం నుంచి పులులు సైతం వలస వస్తు కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ ను సురక్షిత ఆవాసంగా ఏర్పరచుకున్నాయని చెప్పారు.
దేశంలోనే మొక్కల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని,. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుందని వివరించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటామని, నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10,822 కోట్ల వెచ్చించామని చెప్పారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమంపై రూపొందించిన లఘుచిత్రం, డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
అడవుల పరిరక్షణకు విశేష కృషి చేసిన అటవీ అధికారులు, సిబ్బంది, పలు గ్రామపంచాయతీల సర్పంచులు, కార్యదర్శులను సత్కరించి, అవార్డులను అందజేశారపు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ , మేనెజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, అటవీ శాఖ, పంచాయతీరాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.