హైదరాబాద్, సెప్టెంబర్ 11: అటవీ అమర వీరుల త్యాగాలను ఉద్యోగులెవరూ మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ..అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో 1984వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడంబాధాకరమన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అటవీ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
భద్రాది – కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు గతేడాది నవంబర్ 22న గుత్తికోయల చేతిలో ప్రాణాలు కొల్పోయారని, అడవుల సంరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. శ్రీనివాస రావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని, సీఎం కేసీఆర్ మానవత దృక్పథంతో శ్రీనివాస రావు సతీమణి నాలగక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కల్పించారని తెలిపారు.
అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. 2022- 2023వ సంవత్సరంలో అటవీ రక్షణలో భాగంగా అటవీ అధికారులు 79,735 కేసులను నమోదు చేసి, రూ.43.56 కోట్ల జరిమానాను విధించారు. రూ.7.31 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారు.15,122 వాహనాలను జప్తు చేశారు.12,019 అటవీ భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో చెట్లను నరికిన అగంతకులపై 26,408 కేసులు నమోదు చేసి రూ. 57.81 కోట్ల విలువ చేసే కలపను స్వాదీనం చేసుకున్నారు.
ఇక అటవీ శాఖను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నదని తెలిపారు. భవిష్యత్తులో అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం. డోబ్రియాల్, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేష్ జైస్వాల్, ఎఫ్ డీసీ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జూ పార్క్ డైరెక్టర్ ఎస్.వీ.ఎన్. ప్రసాద్, క్యురేటర్ సునీల్ హీరమత్, రిటైర్డ్ పీసీసీఎఫ్ పీకే ఝా, మనోరంజన్ భాంజ, మునీంద్రా, రిటైర్డ్ ఐఎఫ్ఎఎస్లు సునీల్ కుమార్ గుప్తా, బుచ్చి రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.