హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పర్యాటక రంగం అభివృద్ధికి, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అభయారణ్యాల్లో రహదారులు, అండర్పాస్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం అరణ్యభవన్లో నిర్వహించిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తుండటంతో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. జనవరిలో నిర్వహించే అఖిల భారత పులుల గణనకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని వన్యప్రాణి మండలి సభ్యులు సూచించారు.
దేశ, విదేశీ పక్షులు వలస వచ్చే ప్రాంతాల్లో బర్డ్ ఫెస్టివల్ ఏర్పాటుచేస్తే ప్రపంచం నలుమూలల నుంచి పక్షి ప్రేమికులు తెలంగాణకు వస్తారని తెలిపారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే కోనప్ప, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.