హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): జీవాలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకుగాను అవసరమైన స్థాయిలో పశువైద్యులను తయారు చేసేందుకు త్వరలోనే నాలుగు నూతన వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పశుసంవర్ధక, మత్స్యశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, సాధించిన ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ… సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు పశువులకు మెరుగైన, వేగవంతమైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలో మొదట ప్రారంభించిన సంచార పశు వైద్యశాలలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించడం నిదర్శనమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పశుసంవర్ధక శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలను కేటాయిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు. రాష్ట్రంలోని అన్ని పశువైద్యశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు పేరొన్నారు. రూ.370 కోట్ల ఖర్చుతో 58,992 పాడిబర్రెలను సబ్సిడీపై పంపిణీ చేసినట్టు చెప్పారు. అదేవిధంగా పాల సేకరణపై లీటరు పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకం అందించడం, సబ్సిడీపై గడ్డి విత్తనాల సరఫరా, ఉచితంగా పశువులకు వైద్యసేవలు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాల అమలుతో నష్టాలలో ఉన్న విజయ డెయిరీ నేడు రూ.800 కోట్ల టర్నోవర్కు చేరుకున్నదని వివరించారు.
కులవృత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీని చేపట్టగా, రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యసంపద మూడింతలు పెరిగిందని, మత్స్యకారుల ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయని చెప్పారు. ఈ సంవత్సరం 26,778 నీటి వనరులలో 88.53 కోట్ల చేపపిల్లలను రూ.68 కోట్ల వ్యయంతో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం 350 నీటి వనరులలో రూ.25 కోట్ల ఖర్చుతో 10 కోట్ల రొయ్యపిల్లలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హా, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని జిల్లాల్లో క్యాన్సర్ టెస్టులు: హరీశ్రావు
క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనిం గ్ టెస్టులు నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధికారులను ఆదేశించారు. బాధితులను గుర్తించి, సరైన వైద్యం అందించాలని సూచించారు. క్యాన్సర్ చికిత్సపై ప్రభుత్వం ఇప్పటివరకు రూ.642 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. నెలవారీ సమీక్షల్లో భాగంగా బుధవారం నిమ్స్, ఎంఎన్జే దవాఖానల సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిమ్స్లో వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం కేసీఆర్ రూ.157 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.
నిమ్స్లో 200 పడకలతో ఎంసీహెచ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎన్జే హాస్పిటల్లో ఇటీవల అధునాతన ఆపరేషన్ థియేటర్లు ప్రారంభించామని, కొత్తగా నిర్మిస్తున్న దవాఖానను త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దీంతో పడకల సంఖ్య 450 నుంచి 750కి పెరుగుతుందన్నారు. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన టెలీ డయాలిసిస్ సేవలను రాష్ట్ర మంతటికీ విస్తరించాలని మంత్రి ఆదేశించారు. క్యాన్సర్ చికిత్సలో బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సర్జరీలను పెంచాలని ఆదేశించారు. థియేటర్, ఐసీయూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకాగా పాటించాలన్నారు. ఆరోగ్యశ్రీ ఓపీ, ఐపీ సేవలు మరింత పెంచాలని ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, నిమ్స్, ఎంఎన్జే వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.