హైదరాబాద్ : కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం పేదలకు చేరువ చేస్తుందని, ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తూ సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని మంత్రి హరీశ్రావు అన్నారు. వైద్య విద్య పరిధిలోని దవాఖానాల పనితీరుపై మంత్రి శనివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, హెచ్వోడీలు, ఆర్ఎంవోలు, సీఎస్ ఆర్ఎంవోలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశాల్లో విధించిన లక్ష్యాల సాధన, సాధించిన పురోగతి తదితర అంశాలపై
సమీక్షించారు.
ఆసుపత్రులు, విభాగాల వారీగా సంబంధిత విభాగాధిపతులతో మాట్లాడారు. ప్రజలకు మరింతగా న్యాయమైన వైద్య సేవలు అందించేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లో సేవలు ఆరోగ్యశ్రీ కింద మరింత ఎక్కువగా చేయాలన్నారు. ప్రణాళిక రూపొందించుకొని ఆపరేషన్ థియేటర్ వినియోగం పెంచాలన్నారు. సీ సెక్షన్లు గణనీయంగా తగ్గించి, సాధారణ ప్రసవలు పెంచాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఈఎన్టీ, డెర్మటాలజీ సేవలను మరింత మెరుగుపరచాలని, సమీప గ్రామాల్లో ఈఎన్టీ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందించాలన్నారు.
అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో జిల్లా స్థాయిలోనే అత్యవసర సేవలు అందించేలా చూడాలన్నారు. అనవసరంగా హైదరాబాద్ దవాఖానాలకు రెఫర్ చేయొద్దని, అత్యవసర కేసులను తమ వద్దకే పంపాలని ఆసుపత్రులు తమ పరిధిలోని ఆసుపత్రులకు సూచించాలని చెప్పారు. టీచింగ్ ఆసుపత్రుల్లో అందే వైద్య సేవల గురించి అవగాహన కల్పించాలని, అత్యవసర సేవలు అన్నివేళలా అందించేందుకు వీలుగా అనస్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలని, వారానికి ఒక విభాగం వారీగా సూపరింటెండెంట్లు సమీక్షలు నిర్వహించాలన్నారు.
వారం వారం పురోగతిని మెరుగుపడేలా చూడాలని, పీడియాట్రిక్ విభాగంలోనూ ఆరోగ్య శ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలన్నారు. ఎన్ఐసీయూ, పీఐసీయూ సేవలు అందేలా చూడాలని, బాధ్యతగా తీసుకొని ప్రజలకు న్యాయమైన వైద్య సేవలు అందించాలని.. ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖకు గతేడాదితో పోల్చితే బడ్జెట్ డబుల్ చేశారని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదన్నారు.