హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం(సీఎస్ఎస్) కింద తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లను ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు దక్కాల్సిన ఈ నిధులను పొరపాటున ఏపీ ఖాతాలో జమచేశారని గుర్తుచేశారు.
ఈ విషయమై పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని తెలిపారు. సీఎస్ఎస్ నిధులను జనాభా ప్రాతిపదికన విభజించాల్సి ఉండగా, తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది 2014-15లో ఈ నిధులను తెలంగాణకు ఇవ్వకుండా పూర్తిగా ఏపీకి బదలాయించారని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్రం, ఏపీ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి కూడా తీసుకెళ్లామని లేఖలో స్పష్టంచేశారు. అనేకసార్లు ఉత్తరాలు రాశామని, ఎనిమిదేండ్లు గడుస్తున్నా తెలంగాణకు న్యాయం జరగలేదని తెలిపారు. ఇకనైనా తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.