కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సింగరేణిని మనం కాపాడుకోవాలంటే బీజేపీని గద్దె దించడం ఒక్కటే మార్గం. బీజేపీకో హఠావో.. సింగరేణికో బచావో.. అనే నినాదంతో కార్మికలోకం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కును అమ్మేసినట్టే.. సింగరేణిని కూడా లేకుండా చేస్తారు. ఒక్కొక్కటీ అమ్ముకుంటూ పోతూ ఉద్యోగాలు ఊడకొట్టడం మోదీ పనైతే.. మన సీఎం కేసీఆర్ ఆర్టీసీ, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలబడుతూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో 30 పడకలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 100 పడకల ప్రభుత్వ దవాఖానలను మంత్రులు నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆయా చోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.. ‘మొన్న రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని మేం ప్రైవేటుపరం చేయబోమని చెప్పిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత మాట మార్చారు. పార్లమెంటులో మన ఎంపీ వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర గనుల శాఖ మంత్రి సమధానమిస్తూ.. తెలంగాణలో నాలుగు బొగ్గుబావులను ప్రైవేటుపరం చేస్తామని, వాటిని వేలం వేస్తాం తప్ప సింగరేణికి ఇవ్వబోమని చెప్పారు. అంటే ఇది నోటితో నవ్వి.. నొసటితో ఎక్కిరించుడు కాదా? ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలి? పార్లమెంటులో చెప్పిన మాట నమ్మాలా.. లేక రామగుండం గల్లిలో మాట్లాడిన రాజకీయ మాటలు నమ్మాలా? అని ధ్వజమెత్తారు.
బొగ్గు బావులు అమ్మి సింగరేణిని నిర్వీర్యం చేయాలని, కార్మికులను ఆగం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నిజంగా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే సింగరేణిని ప్రైవేటీకరించొద్దని సీఎం కేసీఆర్ రాసిన లేఖపై స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లాలోనే గ్రూప్-4లో వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. వైద్యరంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే, కేసీఆర్ వచ్చిన 8 ఏండ్లలోనే 17 కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన, పల్లెల్లో పల్లె దవాఖాలు వస్తున్నాయని వెల్లడించారు. అత్యుత్తమ వైద్య సేవల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని చెప్పారు. రూ.450 ఉన్న సిలిండర్ ధర నేడు రూ.1,200కు చేరిందని గుర్తుచేశారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, బొగు ్గగనులను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలను పీఎం సమ్మాన్ యోజన, అమృత్ సరోవర్ పేర్లతో కేంద్రం కాపీ కొట్టిందని తెలిపారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
వైద్యసేవల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాకు మహారాష్ట్ర నుంచి వచ్చి వైద్యసేవలు వినియోగించుకుంటున్నారని హరీశ్రావు అన్నారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో గురువారం 30 పడకల దవాఖానను ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెండు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని, తెలంగాణ ఏర్పడ్డాక 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా బస్పాస్లు, పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఆసిఫాబాద్లో జిల్లా ప్రజల కోసం రూ.53 కోట్లతో 340 పడకల దవాఖాన నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో రిమ్స్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కూడా మెడికల్ కళాశాలలు మంజూరు చేశామని, మంచిర్యాలలో ఇప్పటికే మెడికల్ కళాశాల ప్రారంభించామని తెలిపారు. గర్భిణులకు సరైన పోషక విలువలు అందించడం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని, పిల్లల ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిహారం ఇస్తున్నామనిపేర్కొన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని, దీంతో డయేరియా వంటి వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 90 ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా, కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పతిమ మెడికల్ కాలేజీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుంటే బీజేపీ మాత్రం నీచమైన రాజకీయాలు చేస్తున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సర్కార్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపడుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజలపై పన్నులు వేస్తున్నదని దుయ్యబట్టారు. రూ.450 ఉన్న సిలిండర్ ధర నేడు రూ.1200కు చేరిందని గుర్తుచేశారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను పీఎం సమ్మాన్ యోజన, అమృత్ సరోవర్ పేరుతో కేంద్రం కాపీ కొట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీ వెంకటేశ్, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ చౌహత్ బాజ్పాయ్ తదితరులు పాల్గొన్నారు.